tg-me.com/devotional/1078
Last Update:
రుజువర్తన
మన స్వభావం మూడు విషయాలమీద ఆధారపడి ఉంటుంది. అవి ఆలోచన, వాక్కు, కర్మ. ఆలోచనకు మూలం మనసు. అందుకే మనోవాక్కాయకర్మలంటారు. ఇవి త్రికరణాలు. కరణమంటే సాధనం, పనిముట్టు, కారణమనే అర్థాలున్నాయి. ఏ పని చెయ్యాలన్నా దానికి అనుగుణమైన ఆలోచన లేదా తలపు మనసులో కలగాలి. అప్పుడు దాని సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకొని, మాటద్వారా వ్యక్తం చేస్తారు. ఆ పైన కర్మేంద్రియాలతో ఆచరిస్తాం. ఈ విధంగా మనసులో బయలుదేరిన ఆలోచనలన్నీ శరీరంలో పరిసమాప్తమవుతాయి. గౌతమబుద్ధుడు బోధించిన అష్టాంగమార్గంలో సమ్యక్ ఆలోచన, సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ అనే మూడూ ఉన్నాయి. అంటే మంచి ఆలోచన చెయ్యడం, మంచిగా మాట్లాడటం, మంచి పనులు చెయ్యడం అని అర్థం.
ఈ మూడూ మంచిగా ఉండటమే కాదు... వాటి మధ్య సమన్వయమూ కావాలి. మనసులో తాజా ఆలోచనకు, నోటితో మాట్లాడే మాటకు పొంతన ఉండదు కొందరికి. చెప్పే మాటలకూ చేసే పనులకూ సంబంధం ఉండదు మరికొందరి విషయంలో. చాలామందికి మూడూ మూడు దిక్కుల్లో పరుగెడుతుంటాయి. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవాళ్లు చాలామంది కనిపిస్తారు.
మనసా, వాచా, కర్మణా ఒకటిగా ఉండటాన్ని ఆర్జవం అంటారు. ఆర్జవం అంటే రుజుమార్గం, చక్కనైనది అని నిఘంటు అర్థాలు. రుజువంటే తిన్ననైనది. రుజు రేఖ అంటే సరళరేఖ. బాణం ఎలా సరళరేఖలా ఉంటుందో, మన ప్రవర్తన అలా నిటారుగా ఉండాలి. మనసు, వాక్కు, కర్మల్ని ఒకే తాటిపై నిలపగలగాలి. దీన్నే రుజువర్తనమంటారు. మనసు, వాక్కు, కర్మలు రుజువర్తనతో పనిచేసినప్పుడు అటువంటివారిని మహాత్ములంటాం.
చాలామందికి మాటలు కోటలు దాటతాయి కాని, కాలు గడపదాటదు. అంటే, ఆచరణ శూన్యమని అర్థం. ఇటువంటివారు వర్తమానంలో రాజకీయరంగంలో ఎక్కువగా తారసిల్లుతుంటారు. సాహిత్య రంగమూ దానికి భిన్నంగా ఉండటంలేదు. ఆదర్శాలను, సమానత్వాన్ని రచనల్లో ప్రబోధించేవాళ్లు చాలామంది తమ జీవితంలో దానికి భిన్నంగా నడవడం జగమెరిగినదే. సత్యవచనానికన్నా ఆర్జవం ఉన్నతమైనది. ఇందులో ఆలోచన, కర్మ కూడా ఉన్నాయి. శ్రీరాముడు ఆర్జవం వల్లనే పురుషోత్తముడయ్యాడు. ప్రతి మనిషికీ తన అంతరాత్మే సాక్షి. నా మనసులో ఏముందో ఎవరికి తెలుసు అని మనం అనుకోవచ్చు. మనం లోపల ఒకటి భావించి, బయట మరొకటి మాట్లాడితే మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తుంటుంది. అపరాధభావన మనల్ని కుంగదీస్తుంది. దానివల్ల మనసు సంఘర్షణకు లోనవుతుంది. ఒకటి చెప్పి, మరొకటి చేస్తే లోకం నిలదీస్తుంది. నలుగురిలో నగుబాటవుతాం.
మనోవాక్కాయకర్మల మధ్య సమన్వయం పాటించకపోతే కనబడని అంతరాత్మకు, కనిపించే లోకానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కర్మను, వాక్కును నడిపేది మనసైతే- ఆ మనసుకు పైన అంతరాత్మ ఉందని గుర్తు పెట్టుకోవాలి.
నువ్వు ఏ ఆలోచన నాటితే అది నీ మాట అవుతుంది. నువ్వు ఏ మాట మాట్లాడితే అది నీ చర్య అవుతుంది. నువ్వు ఏ చర్య చేస్తే, అది నీ నడవడి అవుతుంది అంటారు స్వామి దయానంద సరస్వతి. త్రికరణాల సరళరేఖను విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోగలిగితే సమాజంలో ధర్మం ప్రతిష్ఠితమవుతుంది. మనమూ మహాత్ములమవుతాం.
BY Devotional Telugu
Warning: Undefined variable $i in /var/www/tg-me/post.php on line 280
Share with your friend now:
tg-me.com/devotional/1078